కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కారాగార శాఖ ప్రత్యేక రిమిషన్ ద్వారా అర్హత సాధించిన 91 మంది యావజ్జీవ ఖైదీలను విడుదల (Life Convicts Releases) చేసినట్లు రాష్ట్ర కారాగార శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. విడుదలైన వారిలో 85 మంది పురుష ఖైదీలు, 6 మంది మహిళా ఖైదీలు ఉన్నారని స్పష్టం చేశారు. వీరందరూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రిమిషన్కు అర్హులుగా గుర్తించబడ్డారని చెప్పారు. విడుదల అనంతరం ఖైదీలు సమాజంలో గౌరవప్రదమైన, సార్థకమైన జీవితం గడపగలిగేలా పునరావాసం, సమాజంలో విజయవంతమైన పునఃసమైక్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ కారాగార శాఖ పలు చర్యలు చేపట్టిందని వివరించారు.నేడు విడుదలైన 91 మందిలో 38 మందికి తెలంగాణ కారాగార శాఖ నిర్వహిస్తున్న వివిధ ఫ్యూయల్ అవుట్లెట్లుల్లో ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయన్నారు.
వీరు విడుదలైన వెంటనే జీవనోపాధి పొందేందుకు, సమాజంలో సాఫీగా కలిసిపోవడానికి ఈ నియామకాలు తోడ్పడనున్నాయని చెప్పారు. మరో 53 మంది విడుదలైన ఖైదీలు స్వయం ఉపాధి, వ్యవసాయం, కుటుంబ వ్యాపారాలు, ఇతర స్వతంత్ర వృత్తులను చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఖైదీల విడుదల మాత్రమే కాదని, బాధ్యత, గౌరవం, ఆశతో కూడిన కొత్త జీవితానికి శ్రీకారం చుట్టే సందర్భమని చెప్పారు. ప్రతి వ్యక్తిలో మార్పు సాధించే శక్తి ఉందని తెలిపారు. శిక్ష విధించడం మాత్రమే కాకుండా సంస్కరణ, సానుకూల మార్పుకు అవకాశం కల్పించడం కూడా కారాగార వ్యవస్థ లక్ష్యమని ఆమె వివరించారు. విడుదలైన ఖైదీలు కుటుంబాలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని, విజయవంతమైన పునరావాసానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.

