కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయంగా జేపీ మోర్గాన్ కేసు సంచలనం రేపుతోంది. జేపీ మోర్గాన్ (JPMorgan) బ్యాంక్ మాజీ ఉద్యోగి చిరాయు రాణా, ఆ సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హజ్దినిపై చేసిన లైంగిక ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. భారత సంతతికి చెందిన రాణా మొదట జాన్ డో అనే మారుపేరుతో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. లోర్నా హజ్దిని తనను మత్తుమందు ఇచ్చి లైంగిక బానిసగా మార్చుకుందని ఆరోపించింది. తన మాట వినకపోతే బోనస్లు కట్ చేస్తానని బెదిరించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 2024లో తాను సంస్థలో చేరినప్పటి నుండి ఈ వేధింపులు మొదలయ్యాయని, ఆమె తన ఇంటికొచ్చి బలవంతం చేసేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఈ ఆరోపణలను లోర్నా హజ్దిని (Lorna Hajdini), జేపీ మోర్గాన్ సంస్థ తీవ్రంగా ఖండించాయి. లోర్నా తరపు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఆమె ఎప్పుడూ ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడలేదని, ఫిర్యాదుదారుడు పేర్కొన్న ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదని స్పష్టం చేశారు. జేపీ మోర్గాన్ ప్రతినిధి కూడా ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. సంస్థ అంతర్గతంగా నిర్వహించిన విచారణలో ఫోన్ రికార్డులు, ఈమెయిల్స్ను పరిశీలించిన తర్వాత, వేధింపులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టం చేసింది.
మరోవైపు ఈ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిరాయు రాణా కంపెనీ నుండి తప్పుకునే సమయంలో కొన్ని మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారని తెలుస్తోంది. విచారణకు ఆయన సహకరించలేదని బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, లోర్నా హజ్దిని నేరుగా ఆయనకు పై అధికారి కాదని, ఆమెకు రాణా బోనస్లను నియంత్రించే అధికారం లేదని సహోద్యోగులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. దీనికి సంబంధించిన పత్రాల్లో మార్పుల కోసం వ్యాజ్యాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు సమాచారం.

