కలం, ఖమ్మం బ్యూరో : పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ కాంట్రాక్టర్ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం (Aswapuram) ఎంపీడీవో కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ జాలే శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పడుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. మండలంలోని మనుబోతులపాడు, ఎలకల గూడెం, గొల్ల గూడెం గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఏళ్లు గడిచిపోతున్నా ప్రభుత్వం బిల్లులు చేయడం లేదనన్నారు.
బిల్లులు ఆలస్యం అవ్వడం వలన అప్పులపాలై, తన ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన పిల్లల చదువులకోసం డబ్బు అవసరం పడిందని, ఊళ్ళో అప్పు కూడా పుట్టడం లేదని చెప్పారు. బిల్లుల కోసం అశ్వాపురం (Aswapuram) ఎంపీడిఓ, సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రటరీల చుట్టూ తిరిగి విసిగిపోయానని తెలిపారు. ఇక తనకు తిరిగే ఓపిక లేక ఎంపీడీవో ఆఫీస్ ఎదుట పడుకోవాల్సి వచ్చిందని చెప్పారు. బిల్లుల పై స్పష్టత వచ్చే వరకూ నిరసన ఆపేది లేదని లేదనీ కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

