కలం, మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్నగర్ (Mahabubnagar) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు (Contract Workers) తమ సమస్యలపై ఆందోళన చేపట్టారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ మాట్లాడుతూ, కార్మికులకు జీతాల పెంపు, ప్రతి నెల 1వ తేదీన వేతనాల చెల్లింపు హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 6, ప్రత్యేక సర్క్యులర్లు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల నిర్వహణ చూస్తున్న సంబంధిత ఏజెన్సీల కాలపరిమితి ముగిసినా కొత్త టెండర్లు లేకపోవడంతో జీతాల పెంపు నిలిచిపోయిందని తెలిపారు. మూడేళ్లకోసారి పెరగాల్సిన వేతనాలు పెరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అలాగే 650 పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో కేవలం 453 పడకలకు సరిపడే సిబ్బందే పనిచేస్తుండడంతో పనిభారం తీవ్రంగా పెరిగిందని పేర్కొన్నారు. అదనంగా కనీసం 100 మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. గత నెల జీతాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వెంటనే చెల్లింపులు జరపాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోతే కార్మికులలో అసంతృప్తి పెరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఏఐటీయూసీ యూనియన్ నాయకులు కార్మికులు మొగులన్న, చెన్నయ్య, రంగన్న, భీమన్న, గొండెలి యాదయ్య, శ్రీనివాస్, ప్రవీణ్,తిరుపతి, బాలరాజ్, మణ్యం, సత్యమ్మ, వరలక్ష్మి, చిట్టెమ్మ, చంద్రకళ, లక్ష్మి, నరసమ్మ, నిరీక్షణ, గీత తదితరులు పాల్గొన్నారు.

