కలం, నల్లగొండ: ఈనెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామినేషన్ను (NEET UG Re Examination) పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Nalgonda Collector) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీట్ పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈనెల 21న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈసారి పరీక్షా విధానంలో కొన్ని మార్పులు వచ్చాయని, అభ్యర్థులకు అదనంగా 15 నిమిషాల సమయం పెంచినట్లు పేర్కొన్నారు.
అలాగే దివ్యాంగులకు 65 నిమిషాల అదనపు సమయం (సాయంత్రం 6:20 గంటల వరకు) ఉంటుందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. జిల్లాకు 15 మంది బలగాలను కేటాయించగా, ప్రతి కేంద్రానికి ఇద్దరు చొప్పున విధుల్లో ఉంటారని తెలిపారు. రీ-ఎగ్జామినేషన్ కోసం కేటాయించిన కొత్త అడ్మిట్ కార్డును మాత్రమే డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు తీసుకురావాలి. పాత అడ్మిట్ కార్డు చెల్లదని సూచించారు. సమీక్షా సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. సుసింధర్ రావు, నీట్ ఎగ్జామినేషన్ కన్వీనర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, డీఎస్పీ శివరామిరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

