కలం, నిర్మల్ : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం చేపట్టనున్న పాఠశాలలు, కళాశాల బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. నీట్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ ప్రవేశ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ కావడం అత్యంత ఆందోళనకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.
లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రశ్నాపత్రాల లీకేజీలు వారి భవిష్యత్తుతో చెలగాటమాడినట్లేనని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. విద్యాసంస్థల బంద్ను విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు శాంతియుతంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

