కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamilnadu) ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీని ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు హస్తం పార్టీ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా లోక్భవన్ ముట్టడించాలని పార్టీ శ్రేణులకు సూచించింది. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ కుట్ర చేస్తున్నారని మండిపడింది. గవర్నర్ చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సూచించింది.
సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో విజయ్..?
108 స్థానాలు గెలుపొంది అతి పెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా గవర్నర్ తాత్సారం చేస్తుండటంపై విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఎస్.ఆర్.బొమ్మై కేసులో.. బల నిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో తప్ప, రాజ్ భవన్లో కాదని సుప్రీంకోర్ట్ స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో, తనకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇచ్చి.. బల నిరూపణకు రెండు వారాలు సమయం ఇవ్వాలని విజయ్ కోరినా.. గవర్నర్ నిరాకరించారు. తగిన సంఖ్యా బలంతో వస్తేనే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తానని గవర్నర్ చెప్పడంతో పీఠముడి పడింది.

