కలం, వెబ్ డెస్క్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి (Rajiv Gandhi Death Anniversary) సందర్భంగా ఢిల్లీ వీర్ భూమిలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ,అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ‘వీర్ భూమి’ వద్ద రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని భట్టి కొనియాడారు. నవ భారత నిర్మాణం కోసం, యువతకు ఓటు హక్కు కల్పించి వారి సాధికారత కోసం ఆయన చూపిన దూరదృష్టి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని చెప్పారు. దేశ ప్రగతి కోసం, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు వృథా కావు అని చెప్పారు. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా సేవకు నిరంతరం పునరంకితమౌతామని పేర్కొన్నారు.
భారతరత్న, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. త్యాగమే వారసత్వంగా జాతి కోసం ప్రాణమే తృణప్రాయంగా చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. సీఎంతో పాటుగా మంత్రులు సైతం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు.

