కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల (Kodimyala) మండల కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం (Medipelli Satyam) వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండలంలోని కీలక నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం తామంతా అహర్నిశలు కృషి చేశామని, అయితే గెలిచిన తర్వాత తమను, నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కొడిమ్యాల మండలానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నెరవేర్చలేదని రాజీనామా చేసిన నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసినా వారిని వారించకుండా వంతపాడుతున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుత సీజన్ లో వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని, ఈ సమస్యపై ఎమ్మెల్యేను (Medipelli Satyam) ప్రశ్నిస్తే బాధ్యతారాహిత్యంగా రైస్ మిల్లర్లను తన్నండి అంటూ సమాధానం ఇస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పూడూర్ ఖాదీ బోర్డు భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుమారు 100 మందికి పైగా రాజీనామా చేశారు.
Read Also: అణచివేత నుంచి అధికారం వైపు!
Follow Us On : WhatsApp

