కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆర్అండ్ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బీజీ కొత్తూరులోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి భూసేకరణ పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవార్డుల జారీ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. సీతారామ, సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టులతో పాటు పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టుల భూసేకరణ, అటవీ అనుమతులు, కోర్టు కేసుల పురోగతిపై ప్రాజెక్టుల వారీగా ఆరా తీశారు. సమస్యలను వెంటనే పరిష్కరించి, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్డీఎల్సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు వివిధ మండలాల తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు పాల్గొన్నారు.

