కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల (Fee Reimbursement) విడుదలతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోతే విద్యార్థులే ఫీజు కట్టాలంటూ పలు కాలేజీ యాజమాన్యాలు అండర్ టేకింగ్ లెటర్లు ఇస్తున్నాయి. విద్యార్థుల నుంచి ప్రత్యేక అండర్ టేకింగ్ లెటర్లను ఇంజనీరింగ్ కాలేజీలు రాయించుకుంటున్నాయి. ఈ ఏడాది చేరుతున్న కొత్త విద్యార్థుల నుంచి అండర్ టేకింగ్ సంతకాలు చేయిస్తున్నాయి. నిర్ణిత గడువు లోపు ఫీజు చెల్లించకపోతే క్లాసులు, పరీక్షలకు అనుమతించమని లెటర్లో వెల్లడించాయి. రెండున్నరేళ్ల నుంచి రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లింపు బంద్ అయింది. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టాలని ఒత్తడి చేయడంతో సర్కారు నిర్లక్ష్యంతో లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
బకాయిలపై నిరసనలు చేసినా.. విజ్ఞప్తి చేసినా.. హైకోర్టుకు పోయినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై కళాశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోమని కాలేజీలను న్యాయస్థానం అనుమతినిచ్చింది. రీయింబర్స్మెంట్ నిధులు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేస్తామంటూ అటు ఆఫీసర్ల వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో తమ భావితవ్యంపై స్టూడెంట్స్, పేరెంట్స్ లో తీవ్రమైన మానసిక ఒత్తిడి పెరిగింది. అటు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు చేసింది.

