కలం, ఆదిలాబాద్ : ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించి, ప్రాణాలు కాపాడే మొదటి రెస్పాండర్లుగా యువత బాధ్యతాయుతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడలోని 2వ బెటాలియన్ లో తెలంగాణ స్పెషల్ పోలీస్ SDRF, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏదైనా ప్రమాదం జరిగిన క్షణంలో అధికారిక యంత్రాంగం లేదా అంబులెన్స్ వచ్చే వరకు వేచి చూడకుండా, శిక్షణ పొందిన యువత తొలి 5 నుండి 10 నిమిషాల్లో స్పందిస్తే ఎన్నో విలువైన ప్రాణాలను రక్షించవచ్చని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 245 మంది యువతీయువకులకు నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి వాలంటీర్కు 16 రకాల అత్యవసర వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను అందజేయడం జరుగుతుందని కలెక్టర్ (Collector Rajarshi Shah) తెలిపారు. అంబులెన్స్ రాకముందే గుండెపోటు బాధితులకు సీపీఆర్ చేయడం ద్వారా వారిని ఎలా స్థిరీకరించవచ్చో ఈ శిక్షణలో క్షుణ్ణంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు.

