కలం, మహబూబ్ నగర్ బ్యూరో: డిజిటల్ బ్యాంకింగ్ సేవల వల్ల ఖాతాదారులకు నాణ్యమైన సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా (Khushboo Gupta) తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana formation day) సందర్భంగా మంగళవారం జాతీయ పతాకావిష్కరణ, యూపీఐ క్యూ ఆర్ కోడ్ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ) ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
అనంతరం బ్యాంకు ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేసే ఉద్దేశ్యంతో ప్రారంభించిన యూపీఐ క్యూ ఆర్ కోడ్ సౌకర్యాన్ని బ్యాంకు చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ప్రారంభించారు. ఇటీవల డీసీసీబీ బ్యాంకు తన ఖాతాదారులకు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల ద్వారా ఖాతాదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్ల సహాయంతో సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు కూడా ఆధునిక బ్యాంకింగ్ సేవలను చేరవేయాలనే లక్ష్యంతో బ్యాంకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా మాట్లాడుతూ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ ద్వారా ఖాతాదారులకు వేగవంతమైన, సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని తెలిపారు. బ్యాంకు అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ఈ చర్యలు ఖాతాదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ (ఐ/సీ) కె.రవికాంత్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎ.జ్యోతి రాణి, మహబూబ్నగర్ డీసీఓ డి. కృష్ణ, డీజీఎంలు, ఏజీఎంలు, బ్యాంకు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

