కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి (Sangareddy)లో హై టెన్షన్ నెలకొంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ వీవోఏలు (IKP VOAs) మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఇంటిని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వీవోఏలు భారీ ఎత్తున మంత్రి ఇంటి వద్దకు తరలివచ్చారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. తమకు అరకొర వేతనాలు చెల్లిస్తున్నారని, కనీసం నెలకు రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు మంత్రి ఇంటి చుట్టూ మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో మంత్రి ఇంటి ముందే నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

