కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పరీక్షా కేంద్రం, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. పరీక్షలు నిబంధనల మేరకు, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయా అనే అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పనితీరు, అభ్యర్థుల హాజరు నమోదు విధానం, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రపరచడం లాంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేందుకు తగిన డెస్కులు, సరైన లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స సదుపాయాలపై కలెక్టర్ అంకింత్ ఆరా తీశారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఎగ్జామ్స్ పూర్తయ్యే దాకా ఇలాగే క్రమశిక్షణ, అప్రమత్తత, పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

