కలం, కరీంనగర్ బ్యూరో: ధాన్యం కేటాయించిన రైస్ మిల్లుల్లో దిగుమతి ప్రక్రియ వేగవంతం చేసి కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నారు. తద్వారా కొనుగోలు రవాణా ప్రక్రియలో మరింత వేగం పెరుగుతుందని తెలిపారు. అధికారులు, మిల్లర్లు, రవాణాదారుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలమని అన్నారు.
కొనుగోళ్ల ప్రక్రియ వేగానికి మిల్లర్లు సాధ్యమైన మేర ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న రెండు వారాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించాల్సి ఉంటుందని, అందుకు తగిన రీతిలో అందరూ సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్, పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, డీఆర్డీఓ శ్రీధర్, డీసీఓ రామానుజాచారి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

