కలం, వెబ్ డెస్క్: ప్రాంతీయ వాదం ఉగ్రవాదం వంటిందన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) స్పందించారు. గతంలో ఏపీ మద్రాస్తో కలిసి ఉందని, ఆ మద్రాస్ రాష్ట్రం నుంచి భాష పేరు మీద మేం విడిపోతామని ప్రాంతీయాభిమానంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు పోరాటంతో 1953లో ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ప్రాంతీయ వాదం ఉగ్రవాదమైతే మీరు మొదటి ఉగ్రవాదులని నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వాదం ఉగ్రవాదం కాదని, నిజమైన జాతీయ వాదం అని స్పష్టం చేశారు. తెలంగాణ 1948 వరకు భారత్లో ఒక సర్వ స్వతంత్య్ర రాజ్యంగా ఉందని, సెపరేట్ సైన్యం, కరెన్సీ, వందకు పైగా దేశాల్లో రాయబారులు, ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనే రాజభవనాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు రాచరికానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేశారన్నారు. అంతిమంగా ఈ సంస్థానం భారత్లో విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడిందని గుర్తు చేశారు. తెలంగాణ వాదంపై మాట్లాడితే నాలుక కోస్తామని పవన్ కల్యాణ్ను హెచ్చరించారు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడాలని, చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణది ప్రాంతీయ వాదం కాదని స్పష్టం చేశారు. ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేశం లేదని, వ్యతిరేకత లేదని నిరంజన్ రెడ్డి అన్నారు. ఇలాంటి కొంత మంది అవగాహన లేని వారు, రాజ్య కాంక్ష ఉన్న వారు, పదవులు కావాలనుకునే వారు తెలంగాణను చిన్నబుచ్చేలా మాట్లాడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలా తెలంగాణను అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో మొదటి ద్రోహి అవుతారన్నారు. కాంగ్రెస్ నాయకుల్లో కేవలం పొన్నం ప్రభాకర్ మాత్రమే పవన్ వ్యాఖ్యలపై స్పందించారని, మిగతా నాయకుల నోళ్లకు పక్షవాతం వచ్చిందా అని ప్రశ్నించారు. పార్టీల పరంగా ఎన్ని అభిప్రాయ బేధాలున్నా తెలంగాణకు అవమానం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించాలని పేర్కొన్నారు.

