కలం, వెబ్ డెస్క్: మహిళలకు సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కాదని.. అసలు సమస్యనే రాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనపైన ఉందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. మహిళకు ఆర్థిక స్వాలంభన వచ్చినప్పుడు కుటుంబం సమాజంలో నిలబడుతుందని చెప్పారు. మహిళా సాధికారితను అమలు చేయడం ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు 60 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను అందజేశామని అన్నారు.
రాష్ట్రంలోని కోటీ మంది మహిళలకు సారె పేరుతో ఇందిరమ్మ చీరలు ఇచ్చామని తెలిపారు. 28 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులను కొనిచ్చి ఆర్టీసీకి లీజు ఇప్పించామని వివరించారు.1,000 మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్లను స్వయం సహాయక మహిళలకు ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను స్వయం సహాయక మహిళలతో ఏర్పాటు చేయించామని తెలిపారు.
అన్ని జిల్లాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలకు భవనాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నారాయణ పేటలో స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించామన్నారు. 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళా సంఘాలకే అప్పగించామని సీఎం వివరించారు. 26 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ లు కుట్టే బాధ్యతను స్వయం సహాయక మహిళలకు ఇచ్చామని అన్నారు. హైటెక్ సిటీ దగ్గర రూ.1,000 కోట్ల విలువ చేసే మూడున్నర ఎకరాల్లో మహిళా శక్తి స్టాల్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. అమెజాన్ తో ఒప్పందం చేసుకుని ఆడబిడ్డల తయారు చేసే ఉత్పత్తులను అమ్మే విధంగా చేశామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళల రక్షణకు పర్యాయ పదంగా తీర్చిదిద్దామన్నారు.
2034 నాటికి వన్ ట్రిలియన్, 20247 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుందని చెప్పారు.ఇది జరగాలంటే మహిళలకు భద్రత ఉండాలని.. సమాజం నిలబడాలంటే మహిళలు తమ కాళ్లపైన తాము నిలబడాలని సీఎం అభిలషించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో మన కళ్ల ముందే డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అయిందని చెప్పారు. వ్యసనాలబారిన పడి ఆ రాష్ట్రం కోలుకోని స్థితిలో ఉందని చెప్పారు . స్కూల్స్ ముందు చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారని అన్నారు.
మత్తుకు బానిసలైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ను తమ ప్రభుత్వం తీసుకువచ్చి డ్రగ్స్ పైన కఠినంగా వ్యవహారిస్తోందన్నారు. ఎంత పెద్ద వారు ఉన్నా, సెలబ్రిటీలు ఉన్నా, ప్రజా ప్రతినిధులు ఉన్నా వదలకుండా అరెస్టు చేస్తున్నామన్నారు. డ్రగ్స్ ను నియంత్రించాల్సిందేనన్నారు. భయం, బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుందని.. దీన్ని ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
Read Also: జోగిపేట సబ్ జైలు ట్రాన్సిట్ హోంగా మార్పు
Follow Us On: WhatsApp

