కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ (Telangana) జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని సబ్ జైలును విదేశీయుల కోసం ప్రత్యేక ట్రాన్సిట్ హోం (Transit Home) ఫర్ ఫారినర్స్ జైలుగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో తొలిసారిగా 13 మంది విదేశీ ఖైదీలను రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి తరలించిన ఈ ఖైదీల్లో 10 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన వీరిపై నేరారోపణలు ఉన్న నేపథ్యంలో జోగిపేట ట్రాన్సిట్ హోంలో ఉంచారు.
వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసించడం, పాస్పోర్ట్ ఉల్లంఘనలు, ఆర్థిక మోసాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా వంటి కేసులలో నిందితులైన విదేశీయులను ఈ కేంద్రంలో ఉంచి తదుపరి వారి స్వదేశాలకు పంపే ప్రక్రియ చేపడతారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ట్రాన్సిట్ హోంలో (Transit Home) ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. విదేశీయుల భద్రత కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.
గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉన్న జోగిపేట సబ్ జైలును ఆధునికంగా మార్పులు చేసి ఈ ట్రాన్సిట్ హోంగా అభివృద్ధి చేశారు. హైదరాబాద్కు సమీపంలో ఉండటం, రహదారి, విమానాశ్రయ అనుసంధానం సులభంగా ఉండటంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఐజీ ఎం. శ్రీనివాస్ పలుమార్లు ఈ కేంద్రాన్ని పరిశీలించి, విదేశీయులకు అనుకూలంగా మార్పులు చేపట్టారు. జైలు అనే భావన లేకుండా ఆధునిక సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఇది విదేశీ ఖైదీలను తాత్కాలికంగా ఉంచి వారి స్వదేశాలకు పంపే ప్రక్రియను సులభతరం చేసే కేంద్రంగా పనిచేయనుంది.
Read Also: ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట: సీఎం రేవంత్
Follow Us On: WhatsApp

