కలం, వెబ్ డెస్క్: క్షేత్ర స్థాయిలో సర్ (SIR) ప్రక్రియ పరిశీలన, సమావేశాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వార్నింగ్ ఇచ్చారు. సర్ ప్రక్రియ సన్నద్ధతపై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జ్ లతో సీఎం నేడు వర్చువల్గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ విషయంలో ఎమ్మెల్యేలు తీవ్ర అలసత్వం వహిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ కోసం, ఓటర్ల భద్రత కోసం చిత్తశుద్ధితో పని చేయకపోతే ఎంతటి సీనియర్ నాయకులనైనా ఉపేక్షించేది లేదన్నారు. పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే వారి స్థానాల్లో వేరే వాళ్లను నియమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రక్రియపై ఇంచార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంచార్జ్ మంత్రులను కూడా మారుస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఓటును కాపాడాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికి రాదని చెప్పారు.
వారంలోగా ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియపై నిర్వహిస్తున్న సమావేశాలను తాను పట్టించుకోవడం లేదన్న అపోహలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని సీఎం (CM Revanth Reddy) అన్నారు. కానీ, తాను ఎప్పటికప్పుడు అన్నీ గమనిస్తూ నోట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా జరుగుతున్న సర్ అవగాహన సదస్సులపై తన వద్ద రిపోర్ట్ ఉందన్నారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నాలుగు సమావేశాలు పెడితే కాంగ్రెస్ మూడు సమావేశాలే ఏర్పాటు చేసిందన్నారు. అలాగే కొత్త గూడెంలో బీజేపీ 8 సమావేశాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. కొత్తగూడెంలో బీజేపీకి ఆదరణ లేకున్నా భారీ ఎత్తున సమావేశాలు పెట్టారని, ఓట్లు తొలగించే పార్టీ 160 సమావేశాలు నిర్వహించిందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం సమావేశాల నిర్వహణలో వెనుకబడి ఉందన్నారు.
సర్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు ఓట్లు కోల్పోతే తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు రద్దవుతాయని, వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున సర్ పై మరిన్ని అవగాహన సదస్సులు జరగాలని చెప్పారు. పార్టీ సర్పంచ్లతో సర్ పై గ్రామాల్లో ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని చెప్పారు. మరో పది రోజుజు సమయం ఇచ్చి చూస్తామని, తర్వాత ఇంచార్జ్ల మార్పుపై నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు.
Read Also: ఫేస్ స్కాన్ .. ఎయిర్పోర్టులో సరికొత్త టెక్నాలజీ..!
Follow Us On: Instagram

