కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వాటిని పూర్తిగా రాయితీపై అందించాలని, ప్రతీ రైతు వేదికలో అందుబాటులో పెట్టాలని సూచించారు. ఎంసీహెచ్ఆర్డీలో వ్యవసాయ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సన్న వడ్లు పండించే రైతుల డేటాను ఏఈవోల ద్వారా సేకరించాలన్నారు. సీజన్లో వచ్చే ధాన్యం దిగుబడిపైన వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడం దమ్మపేట మండలంలో ప్రారంభించి పైలెట్ ప్రాజెక్ట్ను మరింతగా వినియోగించుకునేలా చూడాలని వ్యవసాయ మంత్రికి సూచించారు.
రామగుండం ఎరువులు మొత్తం తెలంగాణకే..
రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరా ప్రస్తుత పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరా తీశారు. ప్రతి ఫెర్టిలైజర్ షాప్ను యాప్లో ఎంటర్ చేయించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే యూరియాను రైతు వేదిక ద్వారా పంపిణీ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో యూరియా పంపిణీ బాధ్యతను అదనపు కలెక్టర్కు అప్పగించాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయిన ఎరువులు మొత్తం తెలంగాణకే ఇవ్వాలని కేంద్రంపైనా ఒత్తిడి తీసుకురావాలన్నారు.
ఈ మేరకు కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు అన్ని పార్టీల ఎంపీల సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించాలని మంత్రి తుమ్మలను (Minister Tummala) కోరారు. వ్యవసాయ శాఖలో సాంకేతికతను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఏఐని మరింత ఎక్కువగా వాడాలన్నారు. ఇందుకోసం అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకోవాలన్నారు. సీడ్స్ నుంచి కొనుగోలు వరకు వ్యవసాయ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పని చేయాలన్నారు. మార్క్ఫెడ్ నష్టాలు తగ్గించడంతో పాటు ఆయిల్ ఫెడ్ మరింత బలోపేతం చేయాలని సూచించారు.
Read Also: రైతుల పాలిట గుదిబండలా “రాజోలిబండ”
Follow Us On: Instagram

