కలం, వెబ్ డెస్క్ : మూసారంబాగ్ బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ (GHMC), సైబరాబాద్, మల్కాజ్ గిరి లోగోలు లాంచ్ చేశారు. దీంతో పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి కొత్త లోగోను తీసుకొచ్చినట్లైంది.
కాగా, హైదరాబాద్ పాలనలో వేగం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC)ను మూడు భాగాలుగా విభజించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ సర్కార్ వేరు చేసింది. వేగంగా విస్తురిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పౌర సేవలను మెరుగుపరచడం, పరిపాలనను వికేంద్రీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలాఉంటే ప్రస్తుతం ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ పరిధిలో శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉంటాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు కేటాయించబడ్డాయి.

