కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కాళేశ్వరంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్ ని కలవబోతున్నారు. నిన్నటి హైకోర్ట్ తీర్పుపై అడ్వకేట్ జనరల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
హైకోర్ట్ తీర్పు మనకు వ్యతిరేకం కాదు..
హైకోర్ట్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి ఊరట లభించలేదని.. కేవలం ఐఏఎస్ అధికారులపై కమిషన్ వ్యాఖ్యలు సరికావని మాత్రమే చెప్పిందన్నారు. అలాగే, నోటీసులు అందించే విధానంపై మాత్రమే విబేధించిందన్నారు. సీబీఐ విచారణ కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరంపై కోర్టుల్లో ఎలాంటి కేసులు పెండింగులో లేవన్నారు. హైకోర్ట్ తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక.. న్యాయ పరంగా ఎలా ముందుకెళ్లాలో ఆలోచిద్దామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

