కలం, వెబ్ డెస్క్: డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ (Invest Telangana)ను నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఆదేశించారు. సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపార రంగంలో వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్ లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ముఖ్యంగా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు.
మెట్రోపై సీఎం రేవంత్ సమీక్ష..
అటు హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాత బస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలనిసంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్ – చాంద్రాయణ గుట్ట మధ్య 7.5 కిలోమీటర్ల మధ్య కారిడార్ నిర్మించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పెండింగ్ భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. పాతబస్తీ మెట్రో విస్తరణపై ఢిల్లీ మెట్రో సలహా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, ప్రభుత్వ సలహాదారులు రామకృష్ణారావు, ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు ఎండీ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

