కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీకి చట్టపరమైన రక్షణలు కల్పించబోతున్నారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా.. ఫ్యూచర్ సిటీని రద్దు చేయకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, ముచ్చర్ల తదితర ప్రాంతాల్లోని 7 మండలాలు, 56 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే గ్రీన్ ఫార్మా సిటీ నిర్వచనాన్ని ‘అర్బన్నెటివ్ అండ్ హ్యూమన్ పబ్లిక్ పర్పస్’గా మారుస్తూ భూసేకరణ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం నిబంధనల సవరణకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో చట్టసవరణ బిల్లు పెట్టి, ఆమోదింపజేయాలని భావిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలతోనేనా..
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్ రావు పలుమార్లు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే చట్టపరంగా రక్షణలు కల్పించి, భూములు ఇచ్చిన వారికి అండగా నిలవాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. దీనిపై త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

