కలం, వెబ్ డెస్క్: అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు రాత్రి హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అమెరికా నుంచే మంత్రులతో జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో మంత్రులతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నేపథ్యంలో సీఎం మంత్రులకు పలు కీలక సూచనలు అందించారు. ప్రచారం, అభ్యర్థుల ఎంపికపై మంత్రులతో చర్చించారు. గెలిచే సూచనలు ఉన్నవారికే బీఫామ్ లు అందించాలని సూచించారు. నాయకులు నచ్చిన వాళ్లకు టికెట్లు ఇచ్చుకోవద్దన్నారు. అందరం కలిసి సమష్టిగా పని చేస్తే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అదే రుజువు చేశాయని గుర్తు చేశారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో కలిసి పని చేసి విజయం సాధించామని, అదే కొనసాగిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఛైర్మన్, మేయర్లను ఇప్పుడే ప్రకటించవద్దని, సామాజిక సమీకరణాల ప్రకారం ఛైర్మన్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని మంత్రులకు సూచించారు. రెబెల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పారు.


