కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆయిల్ కంపెనీలపై సీరియస్ అయ్యారు. గత రెండు రోజులుగా ఆయిల్ కంపెనీలకు పెట్రోల్ బంకుల యజమాన్యాల మధ్య క్రెడిట్ ఇష్యూ కారణంగా పలు బంకులు మూతపడ్డాయని అధికారులు సీఎం చంద్రబాబు కు తెలిపారు. దీంతో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ఔట్ లెట్లకు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని HPCL, IOCL, BPCL కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని మండిపడ్డారు.
ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సప్లై పెరగాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు సమస్యను చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు.

