కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంపై అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు సరఫరాను నియంత్రించాయని అధికారులు సీఎంకు వివరించారు. పెట్రోల్ , డిజీల్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10% బంకులు మూతపడినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని సీఎస్, పౌరసరఫరాల అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు.
కాగా, రాష్ట్రంలోని పలు బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనాదారులతో పాటు రైతులు ఇబ్బందిపడుతున్నారు. వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరిచి ఉన్న బంకుల ముందు వాహనాదారులు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. దీంతో బంకు యజమానులకు , వాహనదారులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. పోలీసులు బంకుల వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

