కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam)లో పార్టీ ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కుప్పం టీడీపీ ఇంచార్జ్గా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. నేడు సీఎం చంద్రబాబు అమరావతిలో కుప్పం టీడీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. శ్రీకాంత్ను బాధ్యతల నుంచి తొలగించడంతో పాటు కుప్పంలో పలువురు ముఖ్య టీడీపీ నేతలపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ కార్యకలాపాల కోసం చంద్రబాబు అనంతపురానికి చెందిన శ్రీకాంత్ను తన పీఏగా నియమించారు.
ఈ సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు స్పందిస్తూ.. కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటా… అని చెప్పినట్లు తెలుస్తోంది. అవసరమైతే రాష్ట్రస్థాయిలో శ్రీకాంత్ సేవలను వాడుకుంటామని తెలిపారు. ఇప్పటి నుంచి కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు సంబంధిత శాఖల బాధ్యతే చూడాలని సూచించారు. మరో మూడు నెలల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తానని సీఎం నాయకులకు హామీ ఇచ్చారు.

