కలం, వెబ్ డెస్క్: ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కర్నూలు (Kurnool) జిల్లాలోని జొన్నగిరి (Jonnagiri) ప్రాంతంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రతిష్టాత్మక గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు (Gold Mining Project)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ఈ ప్రాజెక్టులో పూర్తి స్థాయి ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి. 1494.55 ఎకరాల్లో రూ.320 కోట్లతో మొదటి ప్లాంటు నిర్మించారు. సీఎం చంద్రబాబు రెండో యూనిట్కు శంకుస్థాపన చేసి, ప్లాంట్లో బంగారం శుద్ధి ప్రక్రియను పరిశీలించారు.
ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులో రూ.405 కోట్లతో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ పెట్టుబడులు పెట్టాయి. ఏడాదికి 400 కేజీల నుంచి దశల వారీగా బంగారం వెలికితీతను పెంచనున్నారు. ఉత్పత్తి అయిన బంగారం విలువలో రాష్ట్ర ఖజానాకు 4 శాతం రాయల్టీ ఇవ్వనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభిస్తున్న మొట్టమొదటి గోల్డ్ మైన్ ఇదే కావడం విశేషం. కోలార్, రాయచూర్లో గోల్డ్ మైన్స్ ఉన్నప్పటికీ అవి దేశానికి స్వాంతంత్య్రం రాకముందు నిర్మించినవే. ఈ ప్రాజెక్టుతో స్థానికంగా మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

