కలం, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కాసేపటి క్రితం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల లబ్దిదారులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. అనంతరం తునిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే.. ఆ ఆనందం వేరు అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుందని గమనిస్తానని చెప్పారు. అందుకే తాను బటన్ నొక్కడానికి ఇష్టపడను అంటూ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
జూన్ నెల ఎంతో ప్రత్యేకం
జూన్ నెలకు చరిత్రలో ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మూడు పార్టీలు కలిసింది ఈ జూన్ నెలలోనే అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను, పవన్ కళ్యాణ్ జట్టు కట్టామని వెల్లడించారు. ఆ తర్వాత బీజేపీ కూడా తమతో జట్టు కట్టిందని పేర్కొన్నారు. జూన్ 12న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు వివరించారు.

