కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం సాగుతోంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో 8 విభాగాలపై సీఎం సమీక్ష జరుపుతున్నారు. డీప్ టెక్, సూపర్ సిక్స్, సంక్షేమంపై చర్చించారు. ఈ మేరకు కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫైళ్ల క్లియరెన్స్ ముఖ్యమైన అంశమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దరఖాస్తులను వెంటనే క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు త్వరగా అందుతాయని, పాలనకు టెక్నాలజీతోపాటు మానవతా దృక్పథం కూడా ముఖ్యమని సూచించారు. 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అధికారుల పనితీరును నమోదు చేస్తున్నామని.. అధికారులు పారదర్శకంగా పాలన అందించాలని సూచించారు.
జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా లేని ఫైళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయిలో, హెచ్ఓడీలు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని సూచించారు. మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని చెప్పారు. మరోవైపు ఇ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా క్లియర్ చెేస్తున్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు, 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్కు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

