కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ( Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ సర్కారుదేనని మండిపడ్డారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతేఆ రైతన్నకు దిక్కెవరు? అని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ, దిగులుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్పఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అని ఫైర్ అయ్యారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పుతిప్పలు పెట్టి మరణశాసనం రాస్తుంటే, దిక్కుతోచని అన్నదాత ‘నీ బాంచన్ పంట కొనండి’ అని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడు? అంటూ విమర్శించారు. రైతన్న కన్నీటి శాపం కాంగ్రెస్ పాలకులను వదలదని.. ఆ పాపం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

