కలం, వెబ్ డెస్క్: ప్రపంచ స్థాయి వర్శిటీలతో ఏపీ విశ్వవిద్యాలయాలు పోటీ పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా విభాగాలపై సంబంధిత అధికారులతో గురువారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని.. కోర్సుల ఫోర్ క్యాస్టింగ్ జరగాలని సూచించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లను ప్రోత్సహించేలా విద్యా వ్యవస్థ మార్పులు అందిపుచ్చుకోవాలని చెప్పారు. ఈ మేరకు క్వాంటం టెక్నాలజీపై కోర్సును ప్రారంభించిన ఆంధ్రా యూనివర్సిటీని చంద్రబాబు అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

