కలం, వెబ్ డెస్క్: వరంగల్(Warangal) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు ఆ జిల్లాలో అత్యంత సహజం. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగానే దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య(Basavaraju Saraiah) మధ్య వివాదం నడుస్తోంది. బస్వరాజు సారయ్యది, కొండా సురేఖది ఒకటే నియోజకవర్గం కావడంతో నిత్యం ఇక్కడ ఆధిపత్యపోరు సాగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా కొండా సురేఖ అనుచరులను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తనవైపు తిప్పుకుంటున్నారని కొండా సురేఖ అనుచరులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. పరోక్షంగా బస్వరాజు సారయ్యపై విమర్శలు గుప్పించారు.
ధైర్యంగా ఎదుర్కోలేకే కుట్రలు
‘కొందరు నేతలు ఓ పదిమందిని వెనకేసుకొని సంతోషపడుతున్నారు. వారి ఆనందాన్ని తాము అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. బలహీనులే బలవంతుల వెనక పడతారు. కొండా దంపతులు బలవంతులు’ అంటూ సురేఖ(Konda Surekha) వ్యాఖ్యానించారు. తమను నేరుగా ఢీకొనే ధైర్యం లేకపోవడంతోనే వెనక గోతులు తవ్వే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వారే చివరికి తాము తీసిన గొయ్యిలో తామే పడతారని ఘాటు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను ఎవరిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవసరం లేదని, చిల్లర స్థాయి రాజకీయాలు చేసే వారిపై స్పందించనని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు పరోక్షంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించినవేనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలతో వరంగల్ తూర్పు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow Us On: Sharechat


