కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన చేపట్టింది. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పేపర్ లీక్, సీబీఎస్సీ ఓఎస్ఎం వివాదంపై సీజేపీ నిరసన (CJP Protest) చేపట్టింది. నిరసన గళం వినిపించేందుకు జంతర్ మంతర్ కు భారీగా యువత తరలివస్తున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. సీజేపీ ధర్నాకు పోలీసుల అనుమతినివ్వగా.. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతామని ఆందోళనకారులు పేర్కొంటున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన కార్యక్రమం జరుగనుంది. కాక్రోచ్ మాస్కులతో యూత్ నిరసనకు తరలివచ్చి ధర్నా చేపట్టారు.
ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke).. ధర్నా చేసేందుకు జంతర్ మంతర్కు చేరుకున్నారు. చేతిలో అంబేద్కర్ పుస్తకంతో అభిజీత్ దీప్కే ఎంట్రీ ఇచ్చారు. అంబేద్కర్ పుస్తకాన్ని ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. తన మద్దతుదారులు క్రమశిక్షణ పాటించాలని, నిరసన శాంతియుతంగా జరిగేలా చూడాలని కోరారు. భారీగా యువత తరలిరానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పర్యవేక్షిస్తున్నారు.

