కలం, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పంతంగి గ్రామ శివారులోని శనిగలగుట్ట వద్ద శనివారం ఓ యువకుడు దారుణంగా హత్య (Choutuppal Murder)కు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దానయ్య (30) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో దారుణంగా హత్య చేశారు. గుట్ట వద్ద మృతదేహం పడిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆధారాలు సేకరించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా? లేక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

