కలం, ఖమ్మం బ్యూరో: ప్రజల్లో ఐక్యతకు బోనాల ఉత్సవాలే నిదర్శనమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. మన పండుగల వెనుక ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే గొప్ప సంప్రదాయం దాగి ఉందన్నారు. లక్ష్మీదేవిపల్లి పరిధిలోని సింగరేణి బంగ్లోస్ గేటు సమీపంలో వెలిసిన పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం శ్రావణమాస బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూనంనేని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు వర్ధిల్లాలని అమ్మవారిని ఎమ్మెల్యే కూనంనేని వేడుకున్నారు. ప్రకృతిని పూజించడం తెలంగాణ సంస్కృతిలో భాగమని.. ఇలాంటి ఉత్సవాలతో సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తాయని వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కొత్తగూడెం మున్సిపల్ మేయర్ మూడ్ గణేష్, ఆలయ ధర్మకర్త పాల్గొన్నారు.

