కలం, నకిరేకల్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) తీవ్ర స్థాయిలో విమర్శించారు. నకిరేకల్ (Nakrekal) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా వరకే పంటలు కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం రైతులకు మరణశాసనమేనని లింగయ్య అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో పదేళ్లపాటు స్థిరంగా ఉన్న వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ఆరోపించారు. గత సమైక్య రాష్ట్ర కాలంలో నీటి కొరత, విద్యుత్ సమస్యలతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రక్షణ వలయాన్ని కల్పించిందని చెప్పారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదంతో చేపట్టిన పథకాల వల్ల వ్యవసాయం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ (Mission Kakatiya) ద్వారా వేలాది చెరువుల పూడికతీత, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ తెలంగాణకు నీటి సమస్యలు పరిష్కరించబడ్డాయని ఆయన వివరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఈ పథకాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రైతుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ప్రస్తుతం కొద్ది పంటలకే పరిమితం చేయడం ద్రోహమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పంటలు పరిమితమేనని, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత నుంచి తప్పుకుంటే రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని లింగయ్య (Chirumarthi Lingaiah) హెచ్చరించారు. తెలంగాణలో పండే ప్రతి పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతుందని, ‘జంగ్ సైరన్’ మోగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలు, 70 లక్షల మంది రైతులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: సిరిసిల్ల సీట్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్!
Follow Us On: Instagram

