కలం, స్పోర్ట్స్: వారణాసి (Varanasi) వేదికగా జరగాల్సిన సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ (Senior National Chess Championship) పై ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో జరగాల్సిన ఈ టోర్నమెంట్ను 2027కి వాయిదా వేయకుండా, అదే ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్ణయించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పోటీలు 2026 నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరగనున్నాయి. అంతర్జాతీయ పోటీల బిజీ షెడ్యూల్ వల్ల ఫెడరేషన్ మొదట ఈ టోర్నీని 2027 మార్చి 25 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించాలని భావించింది.
అంతేకాకుండా, ప్రపంచ టోర్నమెంట్లకు అర్హత సాధించేందుకు వీలుగా చిన్న పిల్లల కేటగిరీ పోటీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. సీనియర్ పోటీలకు వయోపరిమితి ఇబ్బందులు ఉండవు కాబట్టి దాన్ని తర్వాత నిర్వహించవచ్చని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని గ్రాండ్ మాస్టర్ అభిజీత్ గుప్తా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా వ్యతిరేకించారు. 2027కి వాయిదా వేయడం అంటే 2026 ఎడిషన్ను రద్దు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే మార్చి నెలలో పరీక్షలు ఉంటాయని, దీనివల్ల యంగ్ చెస్ ప్లేయర్లు చదువు లేదా ఆటలలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వస్తుందని ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో ప్రపంచ ఛాంపియన్లు తయారవుతున్న వేళ, యువ ఆటగాళ్లకు పోటీ పడే అవకాశాలను కష్టతరం చేయవద్దని కోరారు. అభిజీత్ గుప్తా లేవనెత్తిన అంశాలపై AICF వెంటనే స్పందించింది. ముఖ్య భాగస్వాములతో అత్యవసర సమావేశాలు నిర్వహించి, 2026 ద్వితీయార్థంలోనే పోటీలు పెట్టేందుకు రెండు అవకాశాలను పరిశీలించింది.
ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ చెస్ అసోసియేషన్తో చర్చలు జరిపి, పాత వేదిక అయిన వారణాసిలోనే నవంబర్-డిసెంబర్ లలో పోటీలు నిర్వహించాలని ఆమోదముద్ర వేసింది. గతంలో గుంటూరు వేదికగా జరిగిన అక్టోబర్ 2025 ఛాంపియన్షిప్లో పన్నీర్సెల్వం ఇనియన్ తన మొదటి జాతీయ టైటిల్ను గెలుచుకున్నారు. ఇప్పుడు తేదీల సమస్య ముగియడంతో, వారణాసిలో జరగబోయే తదుపరి టోర్నమెంట్పై ఆటగాళ్లు దృష్టి సారించనున్నారు.

