కలం, చండూరు: చండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Chandur FSCS) నూతన చైర్మన్గా గట్టుపల్ గ్రామానికి చెందిన డైరెక్టర్ చెరుపల్లి ఆంజనేయులు (Cherupalli Anjaneyulu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో చైర్మన్గా పని చేసిన కోడి సుష్మ చండూరు మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నిక కావడంతో, ఆమె తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ఖాళీ అయిన చైర్మన్ స్థానానికి సొసైటీ నాన్-అఫీషియల్ సభ్యుల నుండి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియను జిల్లా సహకార శాఖ అధికారి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గట్టుపల్ గ్రామానికి చెందిన డైరెక్టర్ చెరుపల్లి ఆంజనేయులు పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా.. మెజారిటీ డైరెక్టర్లు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు.
చండూరు ఎఫ్ఎస్సీఎస్ (Chandur FSCS)లో మొత్తం 13 మంది డైరెక్టర్ల స్థానాలు ఉండగా, వీరిలో గట్టుపల్కు చెందిన దుబ్బ రాములు అనే డైరెక్టర్ డిఫాల్ట్ అవ్వడం, సుష్మ కౌన్సిలర్గా ఎన్నికై రాజీనామా చేయడంతో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 11కి చేరింది. ఈ 11 మంది డైరెక్టర్లలో 8 మంది డైరెక్టర్లు ఆంజనేయులు అభ్యర్థిత్వానికి అనుకూలంగా ఆమోదం తెలపడంతో అధికారులు ఆయనను చైర్మన్గా అధికారికంగా ప్రకటించారు.
నూతన చైర్మన్గా ఎన్నికైన ఆంజనేయులకు మాజీ చైర్మన్ సుష్మతో పాటు పలువురు డైరెక్టర్లు, చండూరు మండల, పట్టణ ప్రముఖులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ బలోపేతానికి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నూతన చైర్మన్ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ మాజీ అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, అలాగే చండూరు పట్టణ, మండల పరిధిలోని ముఖ్య నాయకులు, సహకార సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు పచ్చజెండా: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
Follow Us On: Instagram

