కలం, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఆవేదన చెందడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి రాజ్య గౌరవానికి ప్రతిరూపమని, ఆ పదవికి ఎల్లప్పుడూ అత్యున్నత గౌరవం, మర్యాద ఇవ్వాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. వాటి పవిత్రతను కాపాడటం మనందరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే…
డార్జిలింగ్లో జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సు సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం తీరుపై రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. సంతాల్ ప్రజలు రాలేని చోట ఈ సదస్సును ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదన్నారు. ఇక్కడ విశాలమైన స్థలం ఉన్నా, ఇరుకుగా ఉంటుందని అధికారులు చెప్పారని, ప్రజలు రాకూడదనే ఉద్దేశంతోనే ఇంత దూరంలో సదస్సు పెట్టారా? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు రావడం కనీస మర్యాద అని, కానీ వారు రాలేదని వ్యాఖ్యానించారు. తాను కూడా బెంగాల్ ఆడబిడ్డనే అని, మమతా దీదీ తన చెల్లెలులాంటిదని, ఆమెకు తనపై ఏమైనా కోపం ఉందో ఏమో.. అందుకే ఇలా జరిగిందేమో అంటూ రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: ఏపీ ఆక్వా ఉత్పత్తులపై వార్ ఎఫెక్ట్!
Follow Us On: Instagram

