కలం, వెబ్ డెస్క్: అమరావతిలోని టోల్ గేట్ ( Toll Gate) వద్ద సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్ గేట్ సిబ్బందిపై భౌతిక దాడికి దిగడంపై సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై తక్షణమే చంద్రబాబు స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అరాచకాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని తేల్చి చెప్పారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల అనుచరులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.

