కలం, వెబ్ డెస్క్: సొంతపార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) గట్టి క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఫ్లెక్సీల కోసం, కుర్చీల కోసం కొట్లాడి పరువు తీసుకోవద్దని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు.
పార్టీకి విధేయంగా ఉంటేనే పదవులు
పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి, అధిష్ఠానానికి విధేయంగా ఉన్న వాళ్లకే పదవులు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ ఒక పదవిని ఎవరికైనా కట్టబెడితే అందరూ సహకరించాల్సిందేనని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో నియంతృత్వంగా వ్యవహరించొద్దని సూచించారు. తను చెప్పిన వాళ్లకే పదవులు ఇవ్వాలని.. తన ఆదేశాల మేరకే నియోజకవర్గంలోని కార్యకర్తలు నడుచుకోవాలన్న ధోరణిని ఎమ్మెల్యేలు వదిలిపెట్టాలని చంద్రబాబు క్లియర్గా చెప్పారు. సీనియర్ నేతలు అయినంత మాత్రాన పదవులు కట్టబెట్టే పరిస్థితి ఉండదని.. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని పేర్కొన్నారు.
నేతల మధ్య విబేధాలు
ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. సొంతపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య కూడా వివాదాలు రాజుకున్నాయి. అధికారులతో కొందరు ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సొంతపార్టీ నేతలకు చురకలు అంటించారు. విబేధాలు విడిచిపెట్టాలని సున్నితంగా హెచ్చరించారు. తనకు ఎవరైనా ఒక్కటేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేస్తేనే గుర్తింపు దక్కుతుందని చెప్పారు. మరి చంద్రబాబు సూచనలతోనైనా పార్టీ నేతలు విబేధాలు వదలి కలిసిమెలిసి పనిచేస్తారా? అన్నది వేచి చూడాలి.

