కలం, వెబ్ డెస్క్ : మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల (Jadcherla)లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కిష్టారెడ్డి నగర్ కాలనీలోని ఓ కిరాణా దుకాణం వద్దకు ముగ్గురు అనుమానితులు వచ్చారు. వారిలో ఇద్దరు బైక్పై బయట వేచి ఉండగా, మరో వ్యక్తి వాటర్ బాటిల్ కొనుగోలు చేసే నెపంతో షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళను గమనించిన నిందితుడు, సరైన సమయం చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని బయటకు పరుగెత్తాడు. వెంటనే బైక్పై ఉన్న తన సహచరులతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

