కలం, వెబ్ డెస్క్: నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణ కోసం రక్షణ శాఖ రంగంలోకి దిగనుంది. పేపర్లు లీక్ కాకుండా ఉండేందుకు, రవాణా కోసం ఏకంగా భారత వైమానిక దళం (IAF) విమానాలను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాధిత్య సింధియా ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఇప్పటికే పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులకు తీవ్ర మనోవేదన కలుగుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 21న మరోసారి నిర్వహించే పరీక్షలో ఎలాంటి తప్పిదం జరగకుండా ఉండేందుకు.. అన్ని రకాల చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా ఎయిర్ఫోర్స్ విమానాల అంశం చర్చకు వచ్చింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు.
ప్రధాని కార్యాలయం నుంచి పర్యవేక్షణ..
నీట్ పరీక్ష పేపర్ అంశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, పరీక్ష నిర్వహణను స్వయంగా పరిశీలించనుందని సమాచారం. పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ సైతం పలుమార్లు ఆరా తీసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ప్రధాని సూచనలతోనే.. పీఎంవో నేరుగా పర్యవేక్షణ చేయబోతుందని తెలుస్తోంది.

