కలం, కరీంనగర్ బ్యూరో : దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ (Karimnagar) డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ కార్పొరేటర్లు, శ్రేణులు టపాసులు కాల్చి… స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించిన రెండు రాష్ట్రాల నాయకులకు ప్రజలు, మహిళలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు ప్రజల మద్దతు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో స్టాలిన్ (Stalin), పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వాల తీరును ప్రజలు గమనించారన్నారు. బెంగాల్ రాష్ట్రంలో గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీ నేడు 200 సీట్ల స్థాయికి ఎదగడం గర్వకారణం అన్నారు. బీజేపి కి పెరిగిన సీట్లు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ విభజన రాజకీయాలు చేయడం దుర్మార్గం అని అన్నారు.
మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించి మహిళలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధ చెప్పడం ఖాయమన్నారు. 2028లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ద్వారానే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వంటి కీలక నేతల నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలనే తమ లక్ష్యమని వారు పునరుద్ఘాటించారు.
Read Also: పశ్చిమ బెంగాల్ కొత్త సీఎం ఎవరు?
Follow Us On : WhatsApp

