కలం, వెబ్ డెస్క్: సీబీఎస్ఈ (CBSE) బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీబీఎస్ఈ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. కోఎంప్ట్ ఎడ్యుటెక్ (Coempt Edutech) సంస్థకు డిజిటల్ మూల్యాంకన కాంట్రాక్ట్ ఇవ్వడంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. తాము జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు లోబడే ఆగస్టు 2025లో టెండర్లను ఆహ్వానించి అర్హత గల సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చామని స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బోర్డు ఘాటుగా సమాధానమిచ్చింది.
సీబీఎస్ఈ వివరణపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు. కేవలం నిరాకరించడం సమాధానం కాదని వ్యాఖ్యానించారు. తాను అడిగిన నాలుగు సూటి ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ, సీబీఎస్ఈ కానీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని నిలదీశారు. గతంలో తెలంగాణలో వివాదాల్లో చిక్కుకున్న గ్లోబరీనా సంస్థే పేరు మార్చుకుని కోఎంప్ట్ గా మారిందని, అలాంటి సంస్థకు 18.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర జ్యుడీషియల్ విచారణతో పాటు సిట్ (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నిజం తెలుసుకునే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.

