కలం, డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కేసులో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆర్డర్లు ఇచ్చింది. ఆయేషా సమాధి నుంచి సేకరించిన అవశేషాలను ఆమె పేరెంట్స్ కు అప్పగించాలని కోర్టు తెలిపింది. ఈ నెల 27న తెనాలిలో మళ్లీ అంత్యక్రియలు జరిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపింది కోర్టు. అంత్యక్రియల కార్యక్రమం మొత్తాన్ని వీడియో రికార్డు చేయాలని.. ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇదంతా జరపాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయేషాకు కేసు విచారణలో భాగంగా రెండోసారి పోస్టుమార్టం జరిపించారు సీబీఐ అధికారులు. ఆయేషా అవశేషాలను తమకు తిరిగి అప్పగించాలంటూ ఆమె పేరెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టు ఈ విధంగా ఆదేశించింది.
ఏం జరిగిందంటే..?
2007 డిసెంబర్ 27న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గా భవానీ లేడీస్ హాస్టల్ లో ఉంటూ బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా (Ayesha Meera) అత్యాచారం, హత్యకు గురైంది. ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2008లో పోలీసులు సత్యంబాబును అరెస్ట్ చేయగా.. ఆయనకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కానీ హైకోర్టు ఆయన్ను 2017లో నిర్దోషిగా ప్రకటించింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించాలని ఆయేషా పేరెంట్స్ కోరడంతో.. ఎనిమిదేళ్లుగా సీబీఐ విచారణ జరుపుతోంది. రీసెంట్ గానే తుది నివేదికను కోర్టుకు సమర్పించింది సీబీఐ. కానీ కోర్టు తుది తీర్పు ఇంకా ఇవ్వకపోవడంతో ఎవరు దోషులు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


