కలం, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University) యాజమాన్యం, ఈవెంట్ నిర్వహణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడటంతో భద్రతా లోపాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కథానాయకుడు యాష్ హాజరైన ఈ వేడుకకు అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తీవ్ర కోలాహలం నెలకొంది. జనసందోహాన్ని అదుపు చేయడంలో నిబంధనలు పాటించకపోవడం, కొందరు విద్యార్థులు లైటింగ్, సౌండ్ సెటప్ పైకి ఎక్కడంతో ఆ నిర్మాణం కూలిపోయింది. సామర్థ్యానికి మించి జనాన్ని అనుమతించడం, తగినంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

